టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇదివరకే ‘పాంచజన్యం’ పేరుతో కొన్ని హామీలు ప్రకటించారు. తాజాగా ఆమె ‘భూలక్ష్మి’ అనే మరో కొత్త పథకం ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పధకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం చొప్పున భూమి పంపిణీ చేస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ‘భూలక్ష్మి పోస్టర్’ విడుదల చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డికి భూమి అంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే. కానీ నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసి ఆడబిడ్డలకు భూమి అంటే ప్రాణం. దాంతో వారికున్న అనుబంధం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ సిఎంకి అర్థం కాదు. ఆయన ఫుట్ బాల్ ఆడతారు కనుక ఆయన భాషలోనే వివరిస్తాను. ఆటలో సమ ఉజ్జీలే ఉండాలి. అప్పుడే అట రక్తి కడుతుంది. అలాగే తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలు కూడా సమాజంలో మిగిలినవారితో సమానంగా గౌరవ మర్యాదలు లభించాలంటే ప్రతీ కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఉండాలి. గ్రామాలలో భూమి ఉన్న రైతులకు, లేనివారికి ఎలాంటి గౌరవం లభిస్తుందో అందరికీ తెలుసు. కనుక రాష్ట్రంలో మిగులు భూమి ఎంతుంది? భూమిలేని పేదల సంఖ్య ఎంత? సాధ్యాసాధ్యాలు వంటి వివరాలన్నీ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నేను ఈ పథకం ప్రకటిస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...
తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందే
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 18, 2026
సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం ‘భూలక్ష్మి’
భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం pic.twitter.com/HRF6DvUnNp