బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించ బడిన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తండ్రి, అన్నకు సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. సరిగ్గా ఇదే విధంగా, వైఎస్ షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు కవిత, షర్మిల మాదిరిగానే, జగన్మోహన్ రెడ్డి వెంట చంచల్ గూడా జైలుకి కూడా వెళ్ళివచ్చిన విజయసాయి రెడ్డి ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం తిరుమలలో ప్రకటించారు. ఈ నెలాఖరులోగా వివరాలు తెలియజేస్తానని చెప్పారు.
కనుక ఇక్కడ కవిత వలన కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏవిధంగా ఇబ్బందిపడుతున్నారో, అదేవిధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిల, విజయసాయి రెడ్డిల వలన ఇబ్బంది పడకతప్పదు. షర్మిల కేవలం కుటుంబం సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రహస్యాలన్నీ తెలుసు. అక్రమాస్తుల కేసులలో జగన్ ఎ-1, విజయసాయి రెడ్డి-2గా ఉన్న్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కూడా విజయసాయి రెడ్డి పేరుంది. కనుక ఆయన నోరు విప్పితే జగన్కు చాలా ఇబ్బందికరంగా మారవచ్చు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇంచుమించు ఒకే రకంగా వ్యవహరిస్తుండటమే వింత అనుకుంటే, రెండు పార్టీలకు సమస్యలు కూడా ఒకేలా ఉండటం ఇంకా విచిత్రమే కదా?