కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తరచూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో గొడవ పడుతూ ఉండేవారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో యుద్ధం మొదలుపెట్టారు.
కానీ ఒంటి చేత్తో చప్పట్లు మోగవన్నట్లు, అవతలి వ్యక్తులు కూడా సై అంటే సై అనడం వలననే గొడవలు జరుగుతుంటాయి.
కడియం శ్రీహరి తనకు తెలియజేయకుండా తన శాఖా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడాన్ని మంత్రి కొండా సురేఖ తప్పు పట్టారు. కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డికి లేఖ వ్రాశారు.
అలా మొదలైన వారి మద్య గొడవని ఆమెతో మాట్లాడి సామరస్యంగా ముగించుకోవచ్చు. కానీ అయన కూడా ఘాటుగా స్పందించడంతో ఇప్పుడీ గొడవ కాంగ్రెస్ పార్టీలో అందరిదీ అయ్కియింది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే “నేనేమి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేదు. నా నియోజకవర్గంలో ఆలయాలకు సంబంధించి సమస్యల గురించి చెప్పేందుకే అధికారులను కలిశాను. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు,” అని అన్నారు.
ఓ పక్క బిజేపి, మరోపక్క బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటుంటే, కాంగ్రెస్ నేతలు ఈవిధంగా గిల్లికజ్జాలతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి కల్పిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నాయకులున్నప్పుడు వారి మద్య ఇలాంటి ఘర్షణలు అనివార్యమే.
కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోకపోతే అవే కార్చిచ్చులా వ్యాపించి పార్టీకి నష్టం కలిగిస్తాయి. మంత్రి సురేఖ లేఖతో వీరి పంచాయితీ ఎలాగూ సిఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది కనుక ఆయనే పరిష్కరిస్తారని ఆశిద్దాం.