కేరళం శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించి అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అయ్యింది. మొత్తం 140 స్థానాలలో సిఎం పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 14 స్థానాలలో విజయం సాధించి మరో 24 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ మరో 41 స్థానాలలో గెలిచి మరో 59 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బిజేపి ఒకే ఒక్క సీటు గెలుచుకొని మరో స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతోంది.
కేరళంలో ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71. యూడీఎఫ్ గెలిచినవి, ఆధిక్యంలో ఉన్నవీ కలిపి చూస్తే 100 సీట్లు. కనుక యూడీఎఫ్ గెలుపు, ప్రభుత్వం ఏర్పాటు తధ్యం.
సిఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా కేరళంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కనుక కేరళంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చేలా చేయడంలో సిఎం రేవంత్ రెడ్డి కూడా భాగస్వామే.
కనుక కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మున్ముందు మరింత ప్రాధాన్యం ఈయడం ఖాయం. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణ మద్దతు ఇస్తోంది.
ఇకపై అయన మాటకు మరింత విలువనిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరోసారి సిఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకు రాగలిగితే, ఆ తర్వాత క్రమంగా జాతీయ కాంగ్రెస్లోకి, తర్వాత జాతీయ రాజకీయాలలోకి మారినా ఆశ్చర్యం లేదు.