తెలంగాణలో ఆషాడమాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నేడు విజయవాడలో ఇంద్రకీలాదిపై కనకదుర్గమ్మవారికి బోనాలు సమర్పించబోతున్నారు.
భాగ్యనగర్ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ కమిటీ గత 16 ఏళ్ళుగా బెజవాడ కనకదుర్గమ్మకి బోనం సమర్పిస్తోంది. కనుక ఆ ఆనవాయితీ ప్రకారం ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు విజయవాడ చేరుకున్నారు.
నేడు పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్ళి కొండపై అమ్మవారిని దర్శించుకొని బోనాలు, తెలంగాణ తరపున అమ్మవారికి సారె సమర్పిస్తారు. ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా నేడు అమ్మవారికి బోనాలు, సారె సమర్పించుకుంటారు.
కనుక ఏపీ పోలీసులు, లయ నిర్వాహకులు వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్డులో కొండపైకి ప్రైవేట్ వాహనాలు వెళ్ళకుండా నిషేధం విధించారు.
అదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను నిలిపివేశారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.