త్వరలో కేరళతో సహా నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బిజేపి అగ్రనేతలు ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు కేరళలోని తిరువనంతపురంలో బిజేపి అధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, “ఇరాన్ యుద్ధం జరుగుతోంది కనుక ఒకవేళ పాకిస్తాన్ కూడా ఏమైనా దుసాహసానికి పాల్పడితే మన ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలో రెండుమూడు సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాము. అవసరమైతే మరోసారి తగిన విధంగా బుద్ధి చెప్తాము,” అని అన్నారు.
ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు తప్పకుండా పాకిస్తాన్ బూచిని చూపడం పరిపాటిగా మారిందనడానికి ఇదే చక్కటి నిదర్శనం. యుద్ధానికి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేకపోయినా రెంటినీ ముడిపెట్టి ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఎన్నికలలో లబ్ది పొందాలనుకోవడం శోచనీయం. దాని బదులు ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ ఏవిధంగా అభివృద్ది చెందుతోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలగురించి మాట్లాడితే ప్రజలకు కూడా హర్షిస్తారు కదా?