పాపం ఏపీ: అమరావతిపై ఇన్ని రాజకీయాలా?

April 01, 2026


img

రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్ళు కావస్తోంది. కానీ ఇంతవరకు ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధత అలాగే ఉంది. దీనికి కారణం మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎట్టి పరిస్థితులలో ‘అమరావతి’ని రాజధానిగా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పేశారు. సిఎంగా ఉన్నప్పుడు నిర్మాణ పనులు నిలిపించేసి నిర్దాక్షిణ్యంగా పాడుబెట్టేశారు. ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదన చేశారు కానీ ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయకుండానే దిగిపోయారు. అందువల్ల జగన్‌ హయంలో ఏపీకి రాజధాని ఏది? అంటే ఎవరూ చెప్పలేకపోయేవారు. 

ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని చకచకా నిర్మిస్తూ, దానికి పార్లమెంట్ చేత ఆమోదముద్ర వేయించుకుంటున్నారు. ఇక ఎవరూ రాజధానిని మార్చలేరని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రులు శాసనసభలో బల్లగుద్ది వాదించారు. కానీ నేను వస్తే అదే శాసనసభలో ఆ తీర్మానాన్ని రద్దు చేస్తా.. రాజధాని మార్చగలను... ప్లాన్ బీలో భాగంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి ‘మావిగన్’ పేరుతో కొత్త రాజధాని ఏర్పాటు చేయవచ్చునంటూ నేడు జగన్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత పట్టుదలగా ఉన్నారో, అది వద్దని జగన్‌ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. కనుక భవిష్యత్‌లో ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని కథ మళ్ళీ మొదటికొస్తుందేమో? పాపం ఏపీ!


Related Post