తెలంగాణ డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య-సాక్షిల వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. డెప్యూటీ సిఎం భట్టి ఆహ్వానం మేరకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం ఆయన అధికారిక నివాసం ప్రజాభవన్కి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.
మాజీ సిఎం కేసీఆర్ ఏంటో ముచ్చటపడి కట్టించుకున్న (ప్రగతి భవన్)ని అధికారం కోల్పోయాక ఖాళీ చేసి ఫామ్హౌసుకి వెళ్ళిపోయారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే, దాని చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగింపజేసి దాని పేరు ప్రజాభవన్గా మార్చారు. దానిని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయించారు.
ఒకప్పుడు దానిలోకి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం అనుమతి లభించేది కాదు. గద్దర్ వంటి ప్రముఖుడు కేసీఆర్ని కలిసేందుకు వచ్చినప్పుడు ఆయనకీ అనుమతి లభించలేదు. రెండు మూడు గంటలు గేటు వద్దనే వేచిచూసి తిరిగి వెళ్ళిపోయారు.
చాలా అరుదుగా ప్రతిపక్ష నేతలకు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సందర్భాలలో కేసీఆర్ అనుమతిస్తేనే లోనికి ప్రవేశం లభించేది.
అలాంటి ప్రజాభవన్లోకి ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అమితంగా ద్వేషించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఒకప్పుడు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమైన ప్రజా భవన్లో ఆయన బద్ద శత్రువు చంద్రబాబు నాయుడు కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.