తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను దక్కించుకొని ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 105 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు జరుగగా వాటిలో 86 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ 18, బిజేపి ఒక్క మున్సిపాలిటీ దక్కించుకున్నాయి.
తొర్రూరు, ఇబ్రహీంపట్నం, జనగామ మరికొన్ని మున్సిపాలిటీలను దక్కించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మద్య ఘర్షణలు జరిగాయి. ఘర్షణలు, కోరం లేక మిగిలిన 11 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. వాటిలో నేడు మళ్ళీ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మరో రెండు మూడు మున్సిపాలిటీలు దక్కించుకునే అవకాశం ఉంది.
కార్పోరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీఏ ఘన విజయం సాధించింది. ఏడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగగా వాటిలో 5 కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపీఐ-కాంగ్రెస్ దక్కించుకోగా కరీంనగర్ కార్పోరేషన్ బిజేపి దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పోరేషన్ కూడా దక్కించుకోలేకపోగా కనీసం గౌరవప్రదమైన స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది.