భారత్-పాక్ మొదలైన యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “భారత్-పాక్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. వాటి మద్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదు.
ఇరు దేశాలు పరస్పరం కొన్ని పిర్యాదులు చేస్తున్నాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధంతో కాదు. కనుక ఇరు దేశాలు వెనక్కు తగ్గి మళ్ళీ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుతున్నాము.
ఇందుకోసం దౌత్యపరంగా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాము. ఎట్టి పరిస్థితులలో యుద్ధంలో అమెరికా తల దూర్చదు,” అని జేడీ వాన్స్ స్పష్టంగా చెప్పారు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ సైతం ఇంచుమించు ఇదేవిదంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఏ పొరుగు దేశమైనా ఈవిదంగానే మాట్లాడుతుంది. కనుక వారి సూచనలను తప్పు పట్టలేము.
గత నాలుగు దశాబ్ధాలుగా పాక్ ఉగ్రవాదానికి భారత్ మూల్యం చెల్లిస్తూనే ఉంది తప్ప ఏనాడూ పాక్ మీద దాడి చేయాలని ప్రయత్నించలేదు. ఇది పాక్ పాలకులకు అలుసుగా అనిపించి ఉండవచ్చు. మనం ఎన్ని దాడులు చేసినా భారత్ మనల్ని ఏమీ చేయ(లే)దు అనే ధీమాతోనే ఉగ్రవాదులను భారత్పైకి పంపిస్తోంది.
కానీ భారత్ సహనానికి ఓ హద్దు ఉంటుందని పాక్ గ్రహించలేదు. అందుకే ఇప్పుడు భారీగా మూల్యం చెల్లిస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు మిత్ర దేశాలను రాజీ కుదర్చమని ప్రాధేయపడుతోంది. సౌదీ అరేబియా సానుకూలంగా స్పందించింది కానీ అమెరికా నిర్ద్వందంగా కుదరదని తేల్చి చెప్పేసింది.