రాజధాని హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా నిర్మించిన బాచుపల్లి ఫ్లై ఓవర్ని సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభోత్సవం చేశారు. గత ప్రభుత్వ హయంలో దీనికి శంఖుస్థాపన చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
రూ. 65.53 కోట్లు వ్యయంతో 1.3 కిమీ పొడవు కలిగిన ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, బౌరంపేట, మల్లంపేట్, గండిమైసమ్మ, గాహులరామారం తదితర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభమవుతాయి. ముఖ్యంగా సైబరాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
దీంతో పాటు రూ.250 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. దీనిలో ఓఆర్ఆర్ ఎగ్జిట్: 18 వద్ద రూ. 229 కోట్లు వ్యయంతో సర్వీసు రోడ్ల నిర్మించబోతున్నారు. రూ. 26 కోట్లు వ్యయంతో నానక్ రాంగూడ నుంచి గచ్చిబౌలి వెళ్ళే మెయిన్ కాజ్ వే విస్తరణ పనులు చేపట్టబోతున్నారు.