తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అడిగిన ఓ ప్రశ్న ఆలోచింపజేస్తుంది. “ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి వంటి గొప్ప రాజధాని దేశంలోనే మరెక్కడా ఉండదని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆయనకు వంత పాడుతుంటారు. అటువంటప్పుడు వారిద్దరితో సహా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? అక్కడే ఉండొచ్చు కదా? కానీ ఇక్కడ నుంచి అమరావతికి ఎందుకు తిరుగుతున్నారు?
మేమంతా మా రాజధాని హైదరాబాద్లోనే ఉంటున్నాము. మీరు కూడా మీ రాజధాని అమరావతిలోనే ఉండాలి కదా?
హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రాలో పాలన సాగించడం కష్టమనే కదా ఆనాడు చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయ కార్యాలయాలను, వివిధ శాఖలలో పని చేసే అధికారులను, ఉద్యోగులను అందరినీ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించుకువెళ్ళారు. వాళ్ళని అక్కడకు తీసుకువెళ్ళి మీరెందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి షటిల్ చేస్తున్నారు?” అని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.