జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ తదితర అన్ని పార్టీలకి మొట్టికాయలు వేసేశారు. కానీ ఇప్పుడు అయన వంతు వచ్చింది. అన్ని పార్టీల నేతలు తిరిగి ఆయనకు మొట్టికాయలు వేస్తున్నారు. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా అయన వ్యాఖ్యలపై తనదైన శైలిలో జవాబు చెప్పారు.
“తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ఆవిధంగా అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు. ఏపీ, తెలంగాణల పేరుతో మీరు చేస్తున్న హడావుడి మీ రాజకీయ ప్రయోజనాల కోసమా లేక మరెవరైనా మీ వెనుక ఉన్నారా?
మీరు, మీ నాన్నగారు అందరూ కమ్యూనిస్టులమని చెప్పుకొని మళ్ళీ కమ్యూనిజం చచ్చిపోయిందంటూ ఆ మాటలేంటి పవన్ కళ్యాణ్? మీ జనసేన పార్టీ ఏదో రోజు వేరేదో పార్టీలో విలీనమయ్యి మాయం అయిపోవచ్చు. కానీ మా కమ్యూనిస్ట్ పార్టీ ఈ భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం సజీవంగా ఉంటుంది.
అయినా మీ సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చారు? ఎవరు కాదన్నారు? మీరు అమాయకులనుకోవాలా లేక మీలో ఓ అపరిచితుడు ఉన్నాడని అనుకోవాలా? ఎందుకీ వ్యర్ధ ప్రసంగాలు? ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజలను రెచ్చగొట్టడం దేనికి?” అని కూనంనేని ప్రశ్నించారు.