భారత్-పాక్ మద్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. భారత్ దళాలు ఈ నెల 6-7 తేదీలలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించి ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేయగానే వెంటనే పాక్ కూడా భారత్పై ప్రతిదాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ కరాచీ, లాహోర్ తదితర ప్రాంతాలలో పాక్ గగనతల వ్యవస్థలు, సైనిక శిభిరాలపై క్షిపణులు, ద్రోణులతో దాడి చేసి ధ్వంసం చేసింది.
ఇందుకు ప్రతిగా పాక్ మళ్ళీ మూడు యుద్ధ విమానాలు, క్షిపణులతో జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ప్రధాన నగరాలు, పట్టణాలు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించగా భారత్ దళాలు వాటిని సమర్ధంగా తిప్పి కొట్టాయి.
పంజాబ్లో పటాన్ కోట్లో గల భారత్ ఆర్మీ, వాయుసేన స్థావరాలపై దాడికి ప్రయత్నించిన మూడు యుద్ద విమానాలను భారత్ దళాలు కూల్చేశాయి. వాటిలో ఒకటి అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పాక్ పైలట్లలను భారత్ దళాలు బందీలుగా పట్టుకున్నారు.
పాక్ దాడులకు ప్రతీకారంగా భారత్ నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్తో సహా సుమారు 26 యుద్ధ నౌకలు కరాచీ నౌకాశ్రయం వైపు వెళ్ళి క్షిపణులతో దాడి చేసి పది యుద్ధ నౌకాలతో సహా నౌకాశ్రయాన్ని ధ్వంసం చేసినట్లు తాజా సమాచారం.
భారత్ త్రివిధ దళాలు ఏక కాలంలో ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్ కోట్లోని సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు చేశాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో, లాహోర్లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థని ధ్వంసం చేశాయి.
భారత్, పాక్ ఇరు దేశాల సరిహద్దు రాష్ట్రాలలో గురువారం ఉదయం నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మ్రోగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రేలుడు శబ్ధాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇరు దేశాలలో దాడులు జరుగుతున్న ప్రాంతాలలో రాత్రిపూట విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, ప్రజలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని భద్రతా దళాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ యుద్ధం నిలిపివేసేందుకు సౌదీ అరేబియాతో సహా పలు మిత్ర దేశాలు భారత్, పాక్లకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇరుదేశాలని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ భారత్తో ప్రత్యక్ష యుద్ధం చేయాలని చాలా కాలంగా ఉవ్విళూరుతున్న పాక్ వెనక్కు తగ్గకపోవడంతో భారత్ కూడా ఎదురు దాడులు చేస్తోంది.