భారత్-పాక్ మద్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండటం, ఇరుదేశాల వద్ద భారీగా అణుబాంబులు ఉండటంతో యావత్ ప్రపంచ దేశాలు ఈ యుద్ధం నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. భారత్-పాక్ మద్య ఉద్రిక్తతలు తగ్గించి మళ్ళీ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సౌదీ అరేబియా ముందుగా చొరవ తీసుకుంది.
ఆ దేశ మంత్రి అదేల్ అల్ జుబైర్ ముందుగా పాకిస్థాన్లో పర్యటించిన తర్వాత నేడు ఢిల్లీకి వచ్చారు.
భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ ఆయనతో సమావేశమై పరిస్థితి వివరించారు. పహల్గాంలో పర్యాటకులని పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపడం గురించి వివరించి, ఈవిదంగా ఉగ్రదాడులు జరుపుతున్నందుకే భారత్ ఇంత కఠిన చర్యలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు.
నేటికీ సరిహద్దుల వద్ద పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయనే విషయం ఆయనకు జైశంకర్ తెలియజేశారు. పాక్ దాడులు చేస్తుంటే భారత్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేదని, అలాగని భారత్కు పాకిస్థాన్తో యుద్ధం చేయాలనే ఆలోచన, కోరిక రెండూ లేవని తెలిపారు.
పాక్ ఉగ్రదాడులు, సరిహద్దుల వద్ద కాల్పులు మానుకొని సంయమనం పాటిస్తే భారత్ కూడా సంయమనం పాటిస్తుందని స్పష్టం చేశారు.
మరి యుద్ధోన్మాదంతో ఉన్న పాక్ పాలకులకు, సైన్యాధికారులకు భారత్ హెచ్చరికలు, సౌదీ హితోక్తులు చెవికి ఎక్కుతాయా లేదా?