'ఆపరేషన్ సింధూర్'లో ప్రజలు నివసించే ప్రాంతాలు, పాక్ సైనిక స్థావరాల జోలికి పోలేదని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తర్వాత పాక్ వెంటనే జమ్ము కశ్మీర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
పాక్ అటువంటి ప్రయత్నం చేస్తుందని ముందే ఊహించి అందుకు సిద్దంగా ఉన్న భారత్ వాటిని గాలిలోనే ధ్వంసం చేసింది. యూఏఎస్ గ్రిడ్, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ దాడులను నిర్వీర్యం చేసినట్లు ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ‘హరాప్ డ్రోన్’లతో లాహోర్లో ‘చైనా తయారీ’ హెచ్క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థని కూడా ధ్వంసం చేసింది. భారత్పై ప్రతీకార దాడులకు పాక్ ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వం సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిరణ్ జూజు చెప్పారు. పాక్ క్షిపణి, డ్రోన్ శకలాలను సేకరిస్తున్నామని త్వరలోనే మీడియా ముందు పెడతామని తెలిపారు.
పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈరోజు పాక్ మీడియాతో మాట్లాడుతూ, కరాచీ, లాహోర్ నగరాలపై భారత్ ‘హరాప్ డ్రోన్’లను ప్రయోగించిందని, కానీ వాటిలో 25 డ్రోన్లను కూల్చేశామని చెప్పారు.
అంటే భారత్, పాక్ పరస్పరం దాడులు చేసుకున్నాయని స్పష్టమైంది. ఈరోజు ఉదయం కరాచీ, లాహోర్లో భయంకరమైన విస్పోటనాలు జరిగాయని వార్తలు కూడా వచ్చాయి.