ఆపరేషన్ సింధూర్తో భారత్ కోటా పూర్తయింది. ఇంకా మిగిలి ఉందేమో తెలీదు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ కోటా మిగిలే ఉంది. భారత్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని పదేపదే హెచ్చరిస్తోంది. కనుక ఏ క్షణంలోనైనా పాక్ దళాలు భారత్పై విరుచుకు పడే ప్రమాదం పొంచి ఉంది. వాటిని ఎదుర్కోవడానికి భారత్ కూడా సిద్దంగానే ఉంది.
కానీ ఇటువంటి సమయంలో ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యమని చెపుతున్నారు మాజీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్హన్.
అలాగని ప్రజలు తుపాకులు పట్టుకొని యుద్ధ రంగంలో ప్రవేశించాల్సిన అవసరం లేదు. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన సిబ్బంది, వాహనాలు, విమానాలు, హెలికాఫ్టర్లు ఒక చోట నుంచి మరో చోటికి వెళుతున్నప్పుడు, ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీయవద్దని, లైకుల కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని మాజీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్హన్ చేశారు.
ఆ విదంగా చేయడం వలన మన భద్రతా దళాల కదలికల గురించి శత్రుదేశానికి సమాచారం అందించి తోడ్పడినట్లవుతుందన్నారు.
ముంబై తాజ్ హోటల్లోకి ఉగ్రవాదులు జొరబడి మారణహోమం చేస్తున్నప్పుడు వారిని మట్టు బెట్టేందుకు భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. అక్కడే ఉన్న మీడియా ఆ దృశ్యాలన్నీ చిత్రీకరిస్తూ, భద్రతా దళాలలో ఎవరు ఎటువైపు నుంచి లోనికి ప్రవేశిస్తున్నారు?మొత్తం ఎంతమంది ఉన్నారు?వారి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి?
హోటల్ బయట పరిస్థితి ఏవిదంగా ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయబోతున్నాయి? వంటి అనేక వివరాలను టీవీ ఛానల్స్లో ప్రసారం చేశాయి.
పాక్లో కూర్చొని ఈ ఉగ్రదాడిని పర్యవేక్షిస్తున్నవారు భారతీయ టీవీ ఛానల్స్లో ఆ వివరాలన్నీ తెలుసుకుంటూ, హోటల్లోపల దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆ సమాచారం చేరవేశారు. అందువల్ల ఉగ్రవాదులను మట్టు బెట్టడం చాలా కష్టమైంది.
కనుక ఇప్పుడు దేశ ప్రజలు అటువంటి పొరపాట్లు చేయవద్దని మాజీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్హన్ విజ్ఞప్తి చేశారు.