ఆపరేషన్ పేరు సిందూర్.. వివరించింది మహిళా అధికారులు!

May 07, 2025


img

ఆపరేషన్ సింధూర్‌ నిర్వహించడంలోనే కాదు.. దానికి ఆ పేరు పెట్టడంలో, ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత దాని గురించి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులతో మీడియాకు బ్రీఫింగ్ చేయించడంలో కూడా మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పవచ్చు. 

పహల్గాంలో ఉగ్రవాదులు పురుషులను వారి భార్యల కళ్ళ ముందే కాల్చి చంపారు. తద్వారా వారి నుదుట బొట్టు (సింధూరం) చెరిపివేశారు. కనుక ఈ ఆపరేషన్‌కి సింధూర్‌ అని పేరు పెట్టి పాకిస్తాన్‌లో ఉగ్రవాదులని మట్టుబెట్టడం ద్వారా ఆ బాధిత మహిళలకు న్యాయం చేసినట్లు బలమైన సంకేతం పంపగలిగారు. ఇది దేశంలో మహిళలందరికీ సరిగ్గానే చేరింది కనుక అందరూ మోడీ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. 

అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన ఈ ఆపరేషన్ సింధూర్‌ క్రెడిట్ కోసం ఢిల్లీ పెద్దలు ఎవరూ ప్రాకులాడకుండా దాని గురించి ఆర్మీకి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ద్వారా మీడియాకు బ్రీఫింగ్ చేయించడం కూడా చాలా తెలివైన నిర్ణయమే.

తద్వారా భారతీయ మహిళలు చాలా శక్తివంతులు. అత్యంత ఉన్నత స్థానాలలో పనిచేస్తున్నారు. భారతదేశం మహిళలని చాలా గౌరవిస్తుంది. వారి జోలికి వస్తే సహించబోమని యావత్ ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయింది. ఇద్దరు మహిళా అధికారుల మీడియా బ్రీఫింగ్ కూడా దేశంలోని మహిళలందరినీ, ముఖ్యంగా యువతని చాలా ఆకట్టుకుంది. అందరిలో దేశభక్తి, స్పూర్తి నింపింది. కనుక దీనికీ దేశంలో మహిళలు ప్రధాని మోడీకి జేజేలు పలుకుతున్నారు. 


Related Post