జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడి భారత్-పాక్ సంబంధాలను పూర్తిగా దెబ్బ తీశాయి. భారత్ ఆంక్షలు, కఠిన నిర్ణయాల నేపధ్యంలో పాక్ కూడా ధీటుగా స్పందిస్తోంది. పాక్ కూడా వాఘా సరిహద్దు వద్ద గేట్లు మూసివేసి భారత్ నుంచి ఎవరినీ పాకిస్థాన్లోకి అనుమతించబోమని ప్రకటించింది. అలాగే పాకిస్థాన్లో భారత దౌత్యకార్యాలయ సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించి మిగిలినవారు వారం రోజులలోగా భారత్ తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
పాకిస్థాన్ పౌరులకు భారత్ వీసాలు జారీ చేయడం నిలిపివేయగా పాకిస్థాన్ కూడా భారత్ పౌరులకు వీసాలు నిలిపివేసింది. ఎప్పటిలాగే మళ్ళీ భారత్ అంతర్జాతీయ విమానాలకు పాకిస్థాన్ ఏర్ స్పేస్ మూసివేసింది. కనుక ఇంతకాలం పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పౌర విమానాలన్నీ ఇకపై చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
పాకిస్థాన్తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని భారత్ నిర్ణయించడంతో, పాకిస్థాన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. సింధూ జలాలు పాకిస్థాన్ చేరకుండా అడ్డుకునే ఎటువంటి ప్రయత్నానైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని భారత్ని హెచ్చరించింది.