కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ (రాజ్) ఫామ్హౌస్లో శనివారం రాత్రి జరిగింది రేవ్పార్టీ కాదు ‘దావత్’ అనే బిఆర్ఎస్ వాదనలతో ఈ వ్యవహారానికి రాజకీయరంగు అంటుకుంది. తనని రాజకీయంగా ఎదుర్కొలేకనే రేవంత్ రెడ్డి ఇటువంటి నీచమైన కుట్రలు చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన బావమరిది కొత్త ఇల్లు కట్టుకొని గృహాప్రవేశం చేసి బంధుమిత్రులకు ‘దావత్’ ఇస్తే దానినే రేవ్పార్టీ అని దుష్ప్రచారం చేస్తూ, తన ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రత్యర్ధులను వలవేసి ఎలా పట్టుకున్నారో, ఆ వీడియోలు మీడియాకి విడుదల చేసి వారిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారో ఎవరూ మరిచిపోలేదని కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. అయినా పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేస్తే దాంతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధం? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు దొరికినా బిఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి రేవ్పార్టీని దావత్ అని అంటోందని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు రికార్డ్ చేసిన వీడియోని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మూడు పార్టీల మద్య ఈ రాజకీయాలు జరుగుతుండగా రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేశారు. కేటీఆర్ని అప్రదిష్టపాలు చేసేందుకు రేవ్పార్టీ అని కేసు నమోదు చేశారని, ఈ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
దానిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు రెండు రోజులు గడువు ఇచ్చింది. ఆలోగా తన న్యాయవాది ద్వారా పోలీసుల నోటీసుకి సమాధానం ఇవ్వవచ్చని తెలిపింది. అంతవరకు ఆయనని అరెస్ట్ చేయవద్దని, ఆ తర్వాత చట్ట ప్రకారమే సాగాలని పోలీసులకు సూచించింది.