సిఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో హైడ్రాని సృష్టించారో కానీ అది నగర ప్రజలపై విరుచుకుపడుతుంటే సామాన్యులు ఆర్తనాధాలు చేస్తున్నారు. మూసీ నివాసులు ధర్నాలు, కోర్టు కేసులే ఇందుకు తాజా నిదర్శనం.
కానీ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా చట్టబద్దత, సర్వాధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు దానికి ఆమోదముద్ర కూడా వేశారు.
కనుక హైడ్రాకి ఇప్పుడు మరింత శక్తివంతంగా మారిందని స్పష్టమవుతోంది. కనుక పేద, సామాన్య మద్యతరగతి ప్రజల ఇళ్ళని కూల్చివేతలు కొనసాగిస్తే ఇప్పుడు దానిని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు. కానీ అది కూల్చేసే ఒక్కో ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని ఖాళీ చేసేస్తుందని మరిచిపోకూడదు.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు హైడ్రా కూల్చివేతలు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించే అవకాశం ఉంటుంది.
ఈసారి బిఆర్ఎస్ నేతల ఫామ్హౌస్లు, కాలేజీలు కూల్చివేసేందుకు ప్రయత్నించవచ్చు. దాని వలన వారు ఆర్ధికంగా నష్టపోయేదాని కంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వంద రెట్లు నష్టపోటుంది.
కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాలను సమర్ధించుకోలేక తడబడవచ్చు... జరుగుతున్న మంచి గురించి గట్టిగా ప్రచారం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీది అందెవేసిన చేయి. కనుక దాని వలన కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం ఎవరూ ఊహించలేరు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగు ముందుకు వేస్తే మంచిది.