రేవంత్‌ అమెరికా పర్యటన... ప్రభుత్వం కుదుట పడినట్లేనా?

July 20, 2024


img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వచ్చే నెల 3వ తేదీన పర్యటనకు బయలుదేరబోతున్నారు. అక్కడ డల్లాస్, న్యూజెర్సీ, శాన్‌ఫ్రానీస్‌కో రాష్ట్రాలలో వారం రోజుల పాటు పర్యటించి పారిశ్రామికవేత్తలను, ఐ‌టి కంపెనీల సీఈవోలను కలిసి తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలని రప్పించేందుకు కృషి చేస్తారు. 

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సస్, ఐ‌టి తదితర రంగాలలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతోంది. సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారుల బృందం అమెరికాలో పర్యటించనున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా పర్యటనకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో వారం రోజులు పర్యటించిన తర్వాత ఆగస్ట్ 11వ తేదీన సిఎం రేవంత్‌ రెడ్డి బృందం హైదరాబాద్‌ తిరిగి చేరుకుతుంది. 

ఆ తర్వాత వీలైన్నప్పుడు ఇదే పనిమీద దక్షిణ కొరియాలో కూడా పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాలకే దావోస్ ఆర్ధిక సదస్సుకు వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు విదేశీ పర్యటనకు బయలుదేరడంతో ఆయన ప్రభుత్వం కుదుటపడిందని సూచిస్తున్నట్లే భావించవచ్చు.

అధికారంలోకి వచ్చినప్పుడు శాసనసభలో కాంగ్రెస్‌ బలం 65 మాత్రమే ఉన్నందున ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్ఎస్‌, బీజేపీలు బెదిరిస్తుండేవి. కానీ పది మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్‌ బలం 75కి పెరిగింది. పైగా అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌  ఓవైసీ కూడా హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యేల ఫిరాయింపులతో బిఆర్ఎస్‌ చాలా బలహీనపడగా, పంట రుణాలు మాఫీ పధకం అమలుచేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత పెరిగింది. కనుక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కాస్త కుదుట పడిన్నట్లే ఉంది. కనుకనే సిఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నట్లు భావించవచ్చు.


Related Post