దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నందున మే 2వ తేదీన పుదుచ్చేరి, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించే అవకాశమునట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి నెలరోజుల క్రితమే కరోనా ఉదృతిని కేంద్రప్రభుత్వం గుర్తించినప్పటికీ శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం లాక్డౌన్ ఆలోచనను పక్కనపెట్టిందని, ఇప్పుడు ఫలితాలు వెలువడగానే లాక్డౌన్ ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికే రెండు వారాలు లాక్డౌన్ విధించుకొన్నాయి. ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించుకొన్నాయి. అయినప్పటికీ కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్నాయి. తెలంగాణలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలే ఇందుకు తాజా నిదర్శనం. దేశంలో ఢిల్లీ, గుజరాత్, యూపీ, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో కరోనా తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. కనుక మే 2 తరువాత ఎప్పుడైనా మళ్ళీ దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.