తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ పంచాయితీ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకి నిదర్శమని చెప్పారు. అదే... పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వాస్తవ పరిస్థితి ఏమిటో అర్దమైఉండేదన్నారు.
కాంగ్రెస్ నాయకులు తనను ప్రతీరోజూ తిడుతూ, తాను చనిపోవాలని శాపనార్ధాలు పెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని ప్రారంభించలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఒకే ఒక్క పాలసీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే తప్ప సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని కేసీఆర్ అన్నారు.
ఈ ఫలితాలు చూసి కాంగ్రెస్ మంత్రులు పొంగిపోతున్నారని, కానీ ఇదే తమ పతనానికి ప్రారంభమని గ్రహించడం లేదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన పాలనకు, సిఎం రేవంత్ రెడ్డి పాలనకు మద్య ఎంత తేడా ఉందో యూరియా సరఫరా వంటి చక్కని ఉదాహరణలతో పార్టీ శ్రేణులకు వివరించారు.
మళ్ళీ చాలా కాలం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ చాలా ఉల్లాసంగా, సంతోషంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. తమ అధినేతని ఆవిధంగా చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలా సంతోషిస్తున్నారు.