ఇవాళ్ళ ఖమ్మం పట్టణంలో కొత్త ఆర్టీసీ బస్టాండు ప్రారంభోత్సవం చేసిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “మా ప్రభుత్వం విన్నూత్నమైన ఆలోచనలు, విధానాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్ఆర్టీసీని లాభాలబట్ట పట్టిస్తోంది. ఆ ప్రయ్త్నాలలో భాగంగానే టీఎస్ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసులను ప్రారంభించాము. మరిన్ని లాభాలు వస్తే ఇటువంటి ఆధునాతనమైన బస్టాండ్లు రాష్ట్రంలో మరిన్ని నిర్మించుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది,” అని అన్నారు.
అయితే ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, “టీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాలలో మునిగిపోయింది. టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టీఎస్ఆర్టీసీలో సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్ సర్వీసులు రెండు కూడా 35 శాతం నష్టాలలో నడుస్తున్నాయి. కనుక ఇప్పట్లో కొత్తగా బస్సులు కొనలేము. కొత్త బస్టాండ్లు కట్టగలిగే పరిస్థితి కూడా లేదు,” అని అన్నారు.
పువ్వాడ టీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెపితే, కేటీఆర్ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం లాభాలబాటలో నడిపిస్తోందని చెప్పడం విశేషం కదా?