అమెరికా అధ్యక్షుడంటే తిరుగులేని అధికారాలు కలిగినవాడు...ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఖాతాలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రాం సోషల్ మీడియా సంస్థలు 24 గంటలపాటు నిషేదం విధించాయి! తాజాగా జనవరి 20వరకు ఆ నిషేదాన్ని పొడిగిస్తున్నట్లు ఫేస్బుక్ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
“జో బైడెన్కు అధికారం బదిలీ చేసే ప్రక్రియను డోనాల్డ్ ట్రంప్ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకొనేందుకు ఫేస్బుక్ వేదికను దుర్వినియోగపరిచినట్లు మేము భావిస్తున్నాము. వాషింగ్టన్ క్యాపిటల్ హిల్పై ఆయన మద్దతుదారులు దాడులకు పాల్పడుతుంటే వారిని వారించే ప్రయత్నం చేయకుండా మరింత ప్రోత్సహిస్తున్నట్లు ఫేస్బుక్లో సందేశాలు పెట్టారు. మా సంస్థ నియమ నిబందనలకు వ్యతిరేకంగా గతంలో కూడా ఆయన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని తొలగించడమో లేదా ట్యాగ్ చేయడమో చేశాము. కానీ ఇప్పుడు ఆయన తన మద్దతుదారులను ఉద్దేశ్యించి ఫేస్బుక్లో పెడుతున్న సందేశాలు దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన జో బైడెన్ అధికారం చేపట్టకుండా అడ్డుకొనేందుకు హింసాత్మక తిరుగుబాటును ప్రేరేపించేవిగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఇటువంటి చర్యలను మేము (ఫేస్బుక్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ ఖాతాపై విధించిన 24 గంటల నిషేధాన్ని జనవరి 20 వరకు పొడిగించాలని నిర్ణయించాము,” అని ఆ ప్రకటన సారాంశం.