తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్ళీ చాలా రోజుల తరువాత ఇవాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కేటీఆర్ గురించి పార్టీలో ఏమి చర్చ జరుగుతోందో నాకు తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అన్నివిధాలా అర్హుడే. నాగార్జునసాగర్ ఉపఎన్నికల గురించి ఎవరూ నాతో సంప్రదించలేదు కానీ ఆ ఎన్నిక ఏకపక్షంగా జరిగితే బాగుంటుంది. రాజకీయాలలో గెలుపోటములు సహజమే. ఒకటి రెండు సీట్లు గెలిచినంత మాత్రన్న ఎగిరెగిరి పడటం సరికాదు. ప్రస్తుతం రాజకీయాలలో వాడుతున్న బాష సరిగా లేదు,” అని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు స్థిరంగా ఉన్నట్లయితే, 2023 శాసనసభ ఎన్నికలలోగానే సిఎం కేసీఆర్ ఏదో ఓ రోజు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమనే భావించవచ్చు. ఒకవేళ సిఎం కేసీఆర్ అందుకు సిద్దమైతే టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆ విషయం గురించి కనీసం రెండుమూడు నెలల ముందుగానే బిగ్గరగా మాట్లాడుతూ ప్రజలను, ప్రతిపక్షాలను మానసికంగా అందుకు సిద్దం చేస్తారు. ప్రస్తుతం అటువంటిదేమీ జరగడం లేదు కనుక ఇప్పట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టరని స్పష్టం అవుతోంది.