రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటుండగా వాటి ఫలితాలపై సిఎం కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఎన్నికల వేడిని మరింత పెంచబోతున్నాయి. తెలంగాణ భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సిఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జీహెచ్ఎంసీ పరిధిలో మన పార్టీ విజయావకాశాల గురించి తెలుసుకొనేందుకు ఇప్పటివరకు నాలుగుసార్లు సర్వే చేయించాను. అన్నిటిలో మనమే గెలుస్తామని తేలింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మన పార్టీ సుమారు 94-104 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని నాలుగు సర్వేలలో స్పష్టం అయ్యింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజెపికి ఇప్పుడున్న సీట్లు కంటే మరో రెండు మూడు పెరిగే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. గత ఆరేళ్ళలో హైదరాబాద్ నగరంలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు ఓసారి గుర్తుచేస్తే చాలు జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం మనదే,” అని అన్నారు.
దుబ్బాక ఉపఎన్నికల గురించి మాట్లాడుతూ, “సోలిపేట రామలింగారెడ్డి మన కుటుంబ సభ్యులలో ఒకరిగా కలిసిపోయారు. ఆయన ఆకస్మిక మరణం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన సేవలకు గుర్తింపుగా దుబ్బాక నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టుకొందాము. దుబ్బాక ఉపఎన్నికలలో మనం లక్షకు పైగా మెజార్టీతో గెలువబోతున్నాము,” అన్నారు సిఎం కేసీఆర్.