తూర్పు లద్దాక్లో భారత్- చైనా సరిహద్దుల సోమవారం అర్దరాత్రి కాల్పులు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాల్పులు జరిగినట్లు చైనా దృవీకరిస్తూ, మొదట భారత్ సైనికులే మాపై కాల్పులు జరుపడంతో ఆత్మరక్షణ కోసం మా సైనికులు ఎదురుదాడి చేయవలసి వచ్చిందని చైనా ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలి తెలిపారని చైనా ప్రభుత్వం అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ సైనికులు సోమవారం రాత్రి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి, చైనా భూభాగంలోకి ప్రవేశించి అక్కడ గస్తీ కాస్తున్నా చైనా సైనికులపై కాల్పులు జరిపారని, తప్పనిసరి పరిస్థితులలో చైనా సైనికులు ఎదురుకాల్పులు జరిపారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద భారత్ చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఇప్పటికైనా భారత్ తన దుశ్చర్యలను మానుకోవాలని లేకుంటే అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని కల్నల్ ఝాంగ్ షుయిలి హెచ్చరించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ ఘటనపై భారత్ ప్రభుత్వం ఇంకా స్పందించవలసి ఉంది.