ఈ నెల మొదటివారం నుంచి హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగాలు) మొదలయ్యాయి. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిన తరువాత సుమారు 60 మందిపై రెండు విడతలలో సుమారు నెలరోజుల నిర్వహించవలసి ఉంది. కానీ మూడు రోజులు ట్రయల్స్ నిర్వహించిన తరువాత కొన్ని అనివార్యకారణాల వలన వారం రోజులపాటు ట్రయల్స్ నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, అహ్మదాబాద్కు చెందిన జైడస్ కాడిలా హెల్త్ కేర్ కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ తయారుచేశాయి. అవి తయారుచేసిన వాక్సిన్లకే దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్లోని నీమ్స్, ఏపీలో విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 15నాటికి వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించినప్పటికీ, సంక్లిష్టమైన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వాటి రికార్డ్స్ తయారుచేయడం, వాటికి ఆమోదం పొందడం వగైరా ప్రక్రియలన్నీ పూర్తవడానికి కనీసం మరో ఆరేడునెలల సమయం పట్టవచ్చని వైద్యనిపుణులు చెపుతున్నారు.