కరోనా మహమ్మారి విషయంలో అమెరికాతో సహా ప్రపంచదేశాలను డబ్ల్యూ.హెచ్.ఓ సకాలంలో అప్రమత్తం చేయకుండా చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూ.హెచ్.ఓకు ఇచ్చే నిధులు నిలిపివేశారు.
ట్రంప్ నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా అధికార ప్రతినిధి జావో లిజియన్ బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం కరోనా మహమ్మారిపై ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటంలో డబ్ల్యూ.హెచ్.ఓ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో అమెరికా నిర్ణయం డబ్ల్యూ.హెచ్.ఓ సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇప్పటివరకు పరస్పరం సహకరించుకొంటూ కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుతున్న ప్రపంచదేశాల మద్య గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. కనుక అమెరికా తన నిర్ణయంపై పునరాలోచించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము, అని అన్నారు.
అయితే కరోనా విషయంలో అమెరికా, చైనాలు స్పందిస్తున్న తీరు గురించి చెప్పుకోవలసి ఉంది. వూహాన్లో కరోనా మహమ్మారి వ్యాపించగానే చైనా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది తప్ప కరోనా వైరస్కు సంబందించిన సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకోలేదు. కనీసం దాని ప్రమాద తీవ్రత గురించి కూడా హెచ్చరించలేదు. కరోనా విజృంభించేవారకు వూహాన్, చైనా నుంచి చైనీయులు, ఇతరదేశాల ప్రజల రాకపోకలను అడ్డుకోకుండా కరోనా వ్యాప్తికి దోదహదపడింది.
కరోనా కేసులు, మృతుల సంఖ్య విషయంలో కూడా చైనా చాలా గోప్యత పాటిస్తూ ప్రపంచదేశాలను తప్పుదోవ పట్టిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. కరోనా వైరస్ విషయంలోనే కాక, వ్యాక్సిన్ తయారీ విషయంలో కూడా చైనా చాలా గోప్యతా పాటిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచదేశాలతో ఆ మందులను అమ్ముకొని వ్యాపారం చేయాలనుకొంటోందని, అందుకే గోప్యతా పాటిస్తోందనే ఆరోపనలు వినిపిస్తునాయి. పైగా ప్రపంచదేశాలకు ఈ దుస్థితి కల్పించినందుకు చైనాలో నేటికీ ఏమాత్రం బాధ, పశ్చాతాపం, అపరాధభావం కనిపించక పోవడం చాలా ఆశ్చర్యకరం.
చైనా వలన అమెరికాకు ఇంత ప్రాణనష్టం, ఉపద్రవం ఎదురవుతున్నప్పటికీ అమెరికాలో స్థిరపడిన లక్షలాది చైనీయుల పట్ల అమెరికా చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. కరోనా మహమ్మారితో ఓ పక్క పోరాడుతూనే ప్రపంచదేశాలకు భారీగా నిధులు విడుదల చేసి మానవత్వం చాటుకొంది. కనుక ఈ విషయంలో అమెరికాను ఎవరూ తప్పు పట్టలేరు. అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనాయే తన వైఖరిని మార్చుకోవలసి ఉంది.