ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది.
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతు కోరుతూ రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబికి పట్టుబడ్డారు. ఆ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు లభించడంతో రేవంత్ రెడ్డి, ఆయన వెనకున్న మాజీ ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో సహా పలువురు జైలుకు వెళ్ళడం ఖాయమని, వారిని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని సిఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. కానీ ఆ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి ఒక్కరే కొన్ని నెలలు జైల్లో ఉంది బెయిల్పై బయటకు వచ్చేరు. ఆ కేసులో తెలంగాణ ఏసీబీ వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఇంతవరకు కేసు విచారణ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రెండు మూడు నెలలోనే తేలిపోతుందనుకున్న ఆ కేసు నేటికీ కొనసాగుతూనే ఉంది. అది ఇంకా ఎంతకాలం సాగుతుందో?అసలు ఎప్పటికైనా ముగిసి తీర్పు వెలువడుతుందో లేదో?