తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. కనుక రాష్ట్రంలోని 9 మునిసిపల్ కార్పోరేషన్లకు మేయర్లు, 120 మునిసిపాలిటీలకు చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈనెల 27న కొత్తగా ఎన్నికైన పాలకమండళ్ళ తొలిసమావేశాలు జరుగుతాయి. ఆరోజు ఉదయం 10.30 గంటలకు సభ్యులు ప్రమాణస్వీకారాలు చేస్తారు. తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, చైర్మన్లను ఎన్నుకొంటారు. వారి ఎన్నిక పూర్తికాగానే డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను ఎన్నుకొంటారు. దాంతో రాష్ట్రంలో అన్ని ప్రధానఎన్నికలు పూర్తవుతాయి.
ఏప్రిల్ 9న రాష్ట్రంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్రావు (బిజెపి), కెవిపి రామచంద్రరావు (కాంగ్రెస్), కె.కేశవరావు (టిఆర్ఎస్) పదవీవిరమణ చేయనున్నారు. వారి స్థానంలో టిఆర్ఎస్ నుంచి ముగ్గురు సభ్యుల ఎంపిక ఉంటుంది. అయితే ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల కోటాలో జరిగేవే కనుక వాటితో ప్రజలకు సంబండమేమీ ఉండదు. కనుక మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో ఎన్నికలు లేనట్లే భావించవచ్చు.