కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్సభ చేత ఆమోదింపజేసుకోగలుగుతోంది కానీ రాజ్యసభలో ఎన్డీయేకి తగిన సంఖ్యాబలం లేకపోవడం వలన ఆమోదముద్ర వేయించుకోలేకపోతోంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పదేపదే ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి కూడా లోక్సభలో ఆమోదముద్ర వేయించుకొని నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాజ్యసభలో దానిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు సాగుతున్నాయి.
ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 241 మంది సభ్యులు ఉండగా వారిలో ఎన్డీయేకు 113, యూపీయేకు 68, ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు మరో 42 మంది సభ్యులు ఉన్నారు. వీరుగాక తటస్థంగా ఉన్న తెరాస(తెలంగాణ), వైసీపీ (ఏపీ), బిజెడి (ఒడిశా), ఎన్పిఎఫ్ (నాగాల్యాండ్), ఇద్దరు ఇతర సభ్యులు కలిపి మొత్తం 18 మంది ఉన్నారు. రాజ్యసభ ఈ బిల్లు పాస్ అవ్వలంటే కనీసం 121 మంది మద్దతు అవసరం. ఎన్డీయేకు 113మంది మాత్రమే ఉన్నారు కనుక తటస్థ పార్టీల చేతిలో ఈ బిల్లు ఉందని చెప్పవచ్చు. వారు మద్దతు ఇస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది లేకుంటే లేదు. కనుక ఆ 18మందిలో ఎంతమంది మోడీ సర్కారుకు అండగా నిలుస్తారో, బిల్లును వ్యతిరేకిస్తారో మరికొద్ది సేపటిలో తేలిపోతుంది.