తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో బుధవారం భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పారు.
“నేను బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ళు పనిచేశాను. కానీ నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపించారు. కనుక మళ్ళీ ఎన్నడూ ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేశారు. అయినా బీఆర్ఎస్ హయంలో జరిగిన తప్పులకు నేను కూడా బాధ్యురాలినే అవుతాను.
నేను ఎవరి తరపున పనిచేయడం లేదు. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాను. నేను ప్రజా బాణాన్ని మాత్రమే. బీఆర్ఎస్ పార్టీలో విభేధాల వలన తెలంగాణ జాగృతి ఏర్పాటు కాలేదు. 19 ఏళ్ళ క్రితమే ఏర్పాటైంది. అప్పటి నుంచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు మేము కృషి చేశాము. ఇప్పుడు దాని ద్వారానే ప్రజలలో రాజకీయాలు కూడా చేస్తున్నాము. అంతే!
వచ్చే ఎన్నికలలో మేము స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తాము. అప్పటి వరకు మరే ఎన్నికలలో పోటీ చేయము. ఆలోగా బలం కూడగట్టుకుంటాము. జనం బాట ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం అవుతాము,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.