నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం జగిత్యాల ఎస్సారెస్పీ గెస్ట్ హౌసులో మీడియా విలేఖరులతో మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా రైతులు చిరకాలంగా జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నేను గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఎన్నికలలో రైతులకు హామీ ఇచ్చాను. ఆ హామీని అమలుచేసే ప్రయత్నంలో భాగంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వానికి పంపించాము. ఈసారి పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేందుకు డిల్లీ వెళ్లినప్పుడు దాని ఏర్పాటు గురించి కేంద్రమంత్రులతో మాట్లాడుతాను. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయబోతున్నాము. అలాగే నిజామాబాద్ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు చేయడానికి గట్టిగా కృషి చేస్తాను,” అని చెప్పారు.
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గతంలోనే పసుపుబోర్డు ఏర్పాటుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సాంకేతికంగా అది ఆచరణ సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమనుకొంటే, అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యం అవుతుందా? లేక తమ బిజెపి ఎంపీ నుంచే మళ్ళీ ప్రతిపాదన వచ్చింది కనుక కేంద్రప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటుకు అంగీకరిస్తుందా? చూడాలి.