మహాకూటమిలో పొత్తులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, టిడిపికి-14, టిజేఎస్-8, సిపిఐ-3 స్థానాలు కేటాయించింది. కానీ తెలంగాణ జనసమితి 12 స్థానాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ ప్రతినిధి విశ్వేశ్వర్ రావు ఈరోజు హైదరాబాద్లో మీడియాకు వెల్లడించడం విశేషం.
తమ పార్టీ దుబ్బాక, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, ఆసిఫాబాద్, జనగాం, మల్కాజ్గిరి, వర్ధన్నపేట, మహబూబ్నగర్, మిర్యాలగూడ, మెదక్, అంబర్పేట నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తెలిపారు. తమ అధినేత కోదండరామ్ కాంగ్రెస్ పార్టీతో ఈ సీట్లపై ఇంకా చర్చిస్తున్నారని, రేపటిలోగా దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
కాగా మహాకూటమి పొత్తులలో భాగంగా టిడిపికి కేటాయించిన మహబూబ్ నగర్ నుంచి ఆ పార్టీ తరపున ఎర్ర శేఖర్ ను అభ్యర్ధిగా టిడిపి నిన్ననే ప్రకటించింది. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో స్టేషన్ ఘన్పూర్ నుంచి సింగపూర్ ఇందిర, ఆసిఫాబాద్ నుంచి అత్రం సక్కు పేర్లను ప్రకటించింది. ఆ స్థానాల నుంచి టిజేఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రతినిధి చెప్పడం ఆశ్చర్యకరమే. ఈ లెక్కన తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.