గత ఎన్నికల సమయంలో పొన్నాల లక్ష్మయ్య కుర్చీ క్రింద మిగిలిన కాంగ్రెస్ నేతలు మంట పెట్టడంతో ఆయన పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలలో అంతా చురుకుగా పాల్గొనడం లేదు. కనుక ఈసారి పొత్తులలో భాగంగా జనగామ స్థానాన్ని టిజేఎస్ కు ఇచ్చేశారని, జనగామ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై పొన్నాల లక్ష్మయ్య స్పందిస్తూ, “జనగామ నియోజకవర్గం చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అటువంటి బలమైన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీల కోసం విడిచిపెడుతుందని నేను అనుకోవడం లేదు. అయినా మహాకూటమిలో మిత్రపక్షలకు సీట్లు కేటాయింపుల గురించి మీడియాకు లీకులు ఇవ్వడం సరైనపని కాదని నేను భావిస్తున్నాను. దాని వలన మిత్రపక్షాలతో చెడుతుంది. మన ప్రత్యర్ధులకు చేజేతులా బలమైయన్ ఆయుధం మనమే అందించినట్లవుతుంది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు కేటాయించడమే కష్టం అవుతోంది. ఇక వేరే పార్టీలకు బీసీ స్థానాలను కేటాయించడం ఎలా సాధ్యం? నాకు జనగామ నుంచి టికెట్ లభిస్తుందనే ఆశిస్తున్నాను,” అని అన్నారు.
పొన్నాల లక్ష్మయ్యకు సీటు ఖరారు చేసినట్లు శుక్రవారం సాయంత్రం కె జానారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు.