మహాకూటమిని, చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న మంత్రి హరీష్ రావు తాజాగా చంద్రబాబుకు “ఫాదర్ ఆఫ్ యూ టర్న్స్” అనే బిరుదు ప్రధానం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బుదవారం తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “ఊసరవెల్లి కంటే చంద్రబాబు నాయుడే వేగంగా రంగులు మార్చగలరు. మాట మార్చడంలో కూడా ఆయనకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయనకు “ఫాదర్ ఆఫ్ యూ టర్న్స్” అనే బిరుదు కూడా ఇవ్వవచ్చు. ఆనాడు తన మామ ఎన్టీఆర్ సమయం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ వరకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు రంగులు మార్చారో...మాట మార్చారో లెక్క చెప్పడం కష్టం. తెలంగాణపై రాజకీయంగా పట్టు సాధించడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఆయన విసిరేసే డబ్బు సంచుల కోసం ఆశపడి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన ఆడమన్నట్లు ఆడుతూ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయడానికి సిద్దపడుతున్నారు. కనుక మహాకూటమికి... దానిలో కాంగ్రెస్ నేతలకు ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు మాట మార్చుతారనే విషయం అందరికీ తెలుసు. ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదని చెప్పిన నోటితోనే ఇప్పుడు హోదా కోసం ఎంతైనా పోరాడుతామని చెపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని దానిని దేశం, రాష్ట్రం సరిహద్దుల నుంచి తరిమికొట్టాలని చెప్పిన ఆయనే ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలపడం అందరూ చూస్తూనే ఉన్నారు. రాజకీయ అనివార్యత, రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఆయన ఏవో కారణాలు చెపుతున్నప్పటికీ, తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆయన ఈవిధంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కానీ మహాకూటమి ద్వారా తెలంగాణలో మళ్ళీ పట్టు సాధించాలనే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.