టిడిపిని, బాబుని వ్యతిరేకించడం అంటే... కేటిఆర్‌ వివరణ

October 29, 2018


img

త్వరలో జరుగబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులమతాలు, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల ఓట్లు చాలా కీలకమని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో...ముఖ్యంగా హైదరాబాద్‌ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లు చాలా కీలకమైనవే. కనుక అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జనాభా ప్రాతిపాదికన వారికి ఒకటి రెండు సీట్లు కేటాయిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. 

నిజాంపేట రోడ్డులోని కె. రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ‘హమారా హైదరాబాద్‌’ పేరిట ఓ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కేటిఆర్‌ కూడా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలలోని కాలనీల అసోసియేషన్స్ అధ్యక్షులు, కార్యదర్శులతో ముఖాముఖీ మాట్లాడారు. 

ఈ సందర్భంగా వారు ‘సిఎం కేసీఆర్‌తో సహా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి చాలా అనుచితంగా మాట్లాడుతుండటం తమకు బాధ కలిగిస్తోందని, అటువంటి పదప్రయోగం చేయకుండా ఉంటే బాగుంటుందని’ మంత్రి కేటిఆర్‌కు చెప్పారు. 

వారి సమస్యలు, సూచనలు అన్నీ ఓపికగా విన్న  తరువాత మంత్రి కేటిఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజకీయాలలో ఒక పార్టీని మరొకటి, ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే. అవి సదరు నేతలకే వర్తిస్తాయి తప్ప ఆ రాష్ట్ర ప్రజలకు కాదు. కనుక మా విమర్శలను ప్రజలు ఎవరూ వ్యక్తిగతంగా  తీసుకొని చూడటం సరికాదు. ఇక్కడ హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమ ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలందరినీ మేము మా ప్రజలుగానే భావిస్తున్నాము తప్ప ఏనాడూ వారి పట్ల వివక్ష చూపలేదు. ఈ సంగతి మీకు తెలుసు. కెసిఆర్ కుమారుడినైన నేను మీకు అండగా నిలబడతాను. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.     

ఇక టిడిపి, దాని అధినేత చంద్రబాబుపై మేము విమర్శలు చేస్తున్న మాట వాస్తవం. ఆయన తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టి ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నందునే ఆయన మాకు రాజకీయ శత్రువు అయ్యారు. ఆయన తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నందునే మేము విమర్శించవలసివస్తోంది తప్ప ఆయనపై మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ లేదు. ఏపీలో టిడిపి, వైకాపా, జనసేన పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్‌, బిజెపిలను అడ్డుకోవలసి ఉంది. ఇకపై అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో కొనసాగాలని కోరుకొంటున్నాను,” అని మంత్రి కేటిఆర్‌ అన్నారు. 


Related Post