సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు ఆయన మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం సత్తుపల్లి నుంచి పోటీ చేయబోతున్న టిడిపి అభ్యర్ధి సండ్ర వెంకటవీరయ్య తరపున ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
తెలంగాణాలో బిజెపి ఎటువంటి అయోమయ పరిస్థితిలో ఉందో టిడిపి కూడా అదే పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. సిఎం కెసిఆర్-మోడీతో స్నేహం కొనసాగిస్తున్నందున, రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ విషయంలో చాలా ఆచితూచి మాట్లాడవలసివస్తోంది. అదేవిధంగా బాలకృష్ణ కూడా సిఎం కెసిఆర్తో సత్సంబంధాలే కలిగి ఉన్నందున ఆయన కూడా టిఆర్ఎస్ సర్కార్, కెసిఆర్లపై ఎటువంటి విమర్శలు చేయలేని పరిస్థితి నెలకొంది.
అందరికీ తెలిసిన ఇతర కారణాల చేత చంద్రబాబు నాయుడు కూడా టిఆర్ఎస్, సిఎం కెసిఆర్ పేరు ఉచ్చరించలేకపోతున్నారు. కానీ టిటిడిపి నేతలు ఆయన సమక్షంలోనే సిఎం కెసిఆర్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. ఈరోజు సత్తుపల్లిలో జరుగబోయే బహిరంగసభలో కూడా ఇదే జరుగబోతోంది. బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్, టిడిపిలు తెలంగాణా ప్రజలకు చేసిన సేవలు గురించి చెప్పుకొంటే, సండ్ర టిఆర్ఎస్పై విమర్శలు గుప్పించవచ్చు. సత్తుపల్లి నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పిడమర్తి రవి టిఆర్ఎస్ కోణంలో టిడిపిపై తీవ్ర విమర్శలు చేస్తుంటే బాలకృష్ణ ఆయనకు ధీటుగా సమాధానం ఇవ్వగలరా?