ఐదు కాదు...ఒకటి గెలిచి చూపించు: ధర్మారెడ్డి

September 27, 2018


img

కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరుతున్నప్పుడు, తాము ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం 5-6 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఇస్తామని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చామని చెప్పారు. కొండా దంపతుల హామీపై టిఆర్ఎస్‌ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందిస్తూ, “కొండా సురేఖ 5-6 స్థానాలు గెలిపించనక్కరలేదు. ఆమె పరకాలలో నాపై పోటీ చేసి గెలిస్తే చాలు. వినాయక చవితి నాటికి వారి వంద తప్పులు పూర్తయ్యాయి.  కొండా దంపతుల అరాచకాలతో విసుగెత్తిపోయున్న ప్రజలు ఈసారి వారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. అటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు అవసరం లేదు,” అని అన్నారు.

కొండా దంపతులు టిఆర్ఎస్‌లో ఉన్న ఈ నాలుగేళ్ళలో టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ వారి గురించి ఈవిధంగా చెడ్డగా మాట్లాడలేదు. వారు అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పలేదు. అలాగే కొండా దంపతులు కూడా టిఆర్ఎస్‌లో ఉన్నంత కాలం మా పార్టీ, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి అంత గొప్పవారు మరెవరూ ఉండరన్నట్లు మాట్లాడేవారు. కానీ కొండా దంపతులు పార్టీలో నుంచి బయటకు వెళ్ళగానే ఎవరు ఎటువంటివారో... ఎవరు ఏమేమి అక్రమాలు, అన్యాయాలు చేసేవారో బయటపెట్టుకొంటూ అందరూ కలిసి తమ అసలు రూపాలు తామే బయటపెట్టుకొంటున్నారు. అయితే ఇది టిఆర్ఎస్‌ ఒక్క పార్టీకే పరిమితం కాలేదు. అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు రాజకీయ నాయకులు అందరికీ ఏదో ఒక గొప్ప ‘చరిత్ర’ ఉందని పార్టీలు మారినప్పుడు వారంతట వారే బయటపెట్టుకొంటున్నారు. ఇదే వారి అసలు రూపం అని సామాన్య ప్రజలకు కూడా అర్ధం అవుతోంది. 


Related Post