తెలంగాణా శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ సిద్దం అయినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలను గట్టిగా వ్యతిరేకిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డే ఈ వార్తను అందరికంటే ముందుగా బయటపెట్టడం విశేషం. నవంబర్ 24వ తేదీన పోలింగ్ జరుగబోతోందని ఆయన నిన్న ప్రకటించారు. అది చెప్పిన 24గంటలు గడువక మునుపే ఎన్నికల షెడ్యూల్ గురించి మీడియాలో వార్తలు రావడం విశేషం. అంటే ఆయన చెప్పింది నిజమేననుకోవాలేమో. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 10-12వ తేదీలలోపు తెలంగాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నవంబర్ 15-20 తేదీల మద్య పోలింగ్ జరిపే అవకాశం ఉంది. ఇదే నిజమైతే డిసెంబరులోగా ఎన్నికలు జరుగవలసిన బిజెపి పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణా శాసనసభ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం అవుతోంది.