హైదరాబాద్‌లో మరో పరువు హత్య

September 19, 2018


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో ప్రణయ్ కుమార్ పరువుహత్య కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుండగానే, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున పట్టపగలు నడిరోడ్డుపై మరో పరువుహత్య జరిగింది. ఈసారి తండ్రే స్వయంగా తన కూతురిని, అల్లుడిని కత్తితో నరికి చంపేందుకు ప్రయత్నించాడు. 

నగరంలో బోరబండకు చెందిన సందీప్(24), మాధవి(22) ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకొన్నారు. దానితో మాధవి తండ్రి మనోహరాచారి కూతురు, అల్లుడిపై పగతో రగిలిపోతూ వారిని హత్య చేయాలని పధకం పన్నాడు. మాధవి మేనమామ చేత కొత్త దంపతులకు ఫోన్ చేయించి ఎర్రగడ్డ వద్ద మాట్లాడుకోవడానికి రమ్మని పిలిపించాడు. వారిద్దరూ ఎర్రగడ్డ చేరుకొని వేచి చూస్తుండగా, వెనుక నుంచి బైక్ పై వచ్చిన మనోహరాచారి కత్తితో కూతురు మెడపై బలంగా వేటు వేసి బండిపై పారిపోయాడు. మాధవి అక్కడే కుప్పకూలిపోయితీవ్ర రక్త స్రావం కారణంగా అపస్మారక స్థితిలోకి జారుకొంది. ఆ దాడిలో సందీప్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ముఖం నుంచి దవడ వరకు కత్తి గాయం అవడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. స్థానికులు వారిద్దరినీ మొదట సనత్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో మాధవి మెదడుకు వెళ్ళే నరాలు తెగిపోవడంతో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మాధవి తండ్రి అక్కడి నుంచి నేరుగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మాధవి తల్లితండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాధవి, సందీప్ ప్రేమ వివాహం చేసుకొని కేవలం వారం రోజులే అయ్యింది. ఇంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది. 


Related Post