ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన మాజీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బాబు ఆగ్రహానికి గురై ఆ పదవి కోల్పోయిన తరువాత వైకాపాకు దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆయుధంగా వాడుకొని చంద్రబాబు నాయుడును బాగానే ఇబ్బంది పెట్టగలిగారు. అయితే ఐవైఆర్ కృష్ణారావు నిన్న హటాత్తుగా బిజెపిలో చేరిపోయి జగన్మోహన్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణతో కలిసి ఆయన శనివారం హైదరాబాద్ వచ్చి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరిపోయారు. అంటే ఇంతకాలం జగన్ చేతిలో ఉన్న ఆయుధం ఇప్పుడు అమిత్ షా చేతుల్లోకి వెళ్ళిందన్నమాట! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కృష్ణారావుకు ఏపీ ప్రభుత్వ గుట్లు అన్ని తెలిసే ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అలాగే చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన కారణంగా ఆయన గురించి ఇతరుల కంటే బాగానే తెలిసే ఉంటుంది. కనుక చంద్రబాబుకు బిజెపి నుంచి కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.