మాజీ శాసనసభ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ నేత సురేశ్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. మంత్రి కేటీఆర్ ఈరోజు ఆయన నివాసానికి వెళ్ళి సమావేశం అయ్యారు. సురేశ్ రెడ్డిని టిఆర్ఎస్లోకి ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపటిలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. అప్పుడు ఈ విశాయ్మ్ ప్రకటించే అవకాశం ఉంది.
స్పీకర్ పదవిలో పనిచేసిన సురేశ్ రెడ్డి తనకు పార్టీలో సముచిత ప్రాధాన్యత లభించడంలేదని గత కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన స్వంత జిల్లా నిజామాబాద్ కు చెందిన డి.శ్రీనివాస్ టిఆర్ఎస్లో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకొంటున్న సంగతి తెలిసిందే. జిల్లా కాంగ్రెస్ నేతలలో ఆయన రాకను వ్యతిరేకిస్తున్న వారిలో సురేశ్ రెడ్డి కూడా ఒకరు. ఆయనతో పాటు పలువురు నేతలు ఇదే కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. నేడో రేపో సురేశ్ రెడ్డితో సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు, వారి అనుచరులు టిఆర్ఎస్లో చేరవచ్చునని సమాచారం.
కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించవలసిన సురేశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలే హస్తం పార్టీకి హ్యాండిచ్చి టిఆర్ఎస్లో చేరిపోవడం ఆ పార్టీకి చాలా ఆందోళన కలిగించే విషయమేనని చెప్పవచ్చు.