గుజరాత్ లో వరుసగా ఆరవసారి అధికారంలోకి వచ్చిన భాజపా సర్కార్ ఇదివరకు ముఖ్యమంత్రిగా చేసిన విజయ్ రూపానినే మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రిగా చేసిన నితిన్ పటేల్ ను కూడా కొనసాగించాలని నిర్ణయించింది. వారిరువురి పేర్లు ఖరారు చేయడంతో గుజరాత్ లో సస్పెన్స్ కు తెర దించింది.
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ను ఓడించి భాజపా అధికారం చేజిక్కించుకొన్నప్పటికీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధంలో ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్ మొన్న జరిగిన ఎన్నికలలో ఓడిపోయారు. కనుక అయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాలి. కానీ మెజారిటీ భాజపా ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు పలుకుతుండటంతో అయోమయస్థితి నెలకొని ఉంది. ఒకవేళ ఆయనను కాదని వేరొకరిని ఎంపిక చేసినట్లయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. అలాగని ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్ధిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పవు. కానీ ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నేడోరేపో ముఖ్యమంత్రి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.