కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, భాజపా వ్యతిరేక పార్టీలు నోట్ల రద్దు, జి.ఎస్.టి.లను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసాయి. నేడు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. తరువాత భాజపాకు అత్యంత కీలకమైన గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపధ్యంలో నేడు గౌహతిలో జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశం జరుగబోతోంది.
ప్రతీసారి సమావేశాలలో వివిధ రాష్ట్రాలు చేస్తున్న ప్రతిపాదనలపై చర్చించి వాటిలో సహేతుకంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకొని కొన్ని ఉత్పత్తులు, సేవలపై జి.ఎస్.టి. స్లాబు రేట్లను సవరిస్తున్నారు. కానీ ఈసారి ఈ ప్రత్యేక పరిస్థితిలో జి.ఎస్.టి.సమావేశం జరుగుతోంది కనుక సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా వివిధ ఉత్పత్తులు, సేవలపై జి.ఎస్.టి.ని బారీగా తగ్గించే అవకాశం కనబడుతోంది. కనుక ఈరోజు జరుగబోతున్న ఈ సమావేశం ప్రత్యేకమైనదేనని భావించవచ్చు.
ఈ సమావేశానికి యధాప్రకారం అన్ని రాష్ట్రాల ఆర్దికమంత్రులు లేదా వారి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో తిరుమలను జి.ఎస్.టి. నుంచి మినహాయించాలని ఏపి సర్కార్ కోరబోతోంది. అలాగే జి.ఎస్.టి. మినహాయించిన ఉత్పత్తులు, సేవలపై కూడా ప్రజలను జి.ఎస్.టి. పేరుతో అడ్డుగా దోచుకొంటున్న వ్యాపారులపై కటినమైన చర్యలు తీసుకోవలసిందిగా ఏపి ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ వ్రాశారు. దీనిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.