రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఎట్టకేలకు తెరాస కూడా స్పందించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఆయన (రేవంత్ రెడ్డి) ఏ పార్టీలోనైనా చేరవచ్చు అది అయన ఇష్టం. ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారు తప్ప తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్దరించడానికి కాదు. అయన కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన్న మేము ఉలిక్కి పడనవసరం లేదు. తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో వేరే గత్యంతరం లేక అయన కాంగ్రెస్ పార్టీలో చేరారని అందరికీ తెలుసు. అయితే తెలంగాణా ప్రజల కోసమే తెదేపాను వీడానని గొప్పలు చెప్పుకొంటున్న ఆయన, తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ మాటలు చెప్పడమే విడ్డూరంగా ఉంది. తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం మా ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ప్రజలు మా వెంట ఉన్నంతకాలం ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఫరక్ పడదు,” అని అన్నారు.