ఏపి సిఎంతో వర్మ పరాచికాలు

October 31, 2017


img

రామ్ గోపాల్ వర్మ ఇవ్వాళ్ళ మళ్ళీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన మరో ఫోటో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది నందమూరి రామారావు దంపతులు తమ కుమార్తె భువనేశ్వరి-చంద్రబాబు నాయుడు వివాహకార్యక్రమానికి సబంధించిన ఒక ఫోటో. దానిలో నలుగురూ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటో గురించి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “హరిణి తన అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో రూపొందించిన అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది” అని కామెంట్ పోస్ట్ చేసి, ఆ ఫోటో క్రింద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎ రామ్ గోపాల్ వర్మ ఫిలిం అని వ్రాసి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు నిజజీవితంలో జరిగిన ఆ సన్నివేశాన్ని తన సినిమాలో వాడుకోబోతున్నానని రామ్ గోపాల్ వర్మ చెప్పకనే చెప్పాడు. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనే సంగతి కూడా పట్టించుకోకుండా, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఫొటోలను తన సినిమా ప్రచారానికి వాడుకోవడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీ నేతలను కవ్వించడానికే ఇటువంటి కొంటె పనులు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదివరకు కూడా ఈ సినిమా పేరుతో రామ్ గోపాల్ వర్మ ఇటువంటి కొంటె పనులు చేసినా చంద్రబాబు నాయుడు చాలా సంయమనంగా వ్యవహరించడమే కాకుండా తన పార్టీ నేతలను కూడా కట్టడి చేశారు. దాని వలన తన సినిమాకు అవసరమైన వివాదం తలెత్తకపోవడంతో అతను కొంచెం నిరాశకు గురయ్యి ఉండవచ్చు. 

బహుశః అందుకే ఈరోజు మళ్ళీ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఉండవచ్చు. దీనిపై చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ కోరుకొంటున్నది కూడా అదే కనుక వెంటనే ధీటుగా స్పందించవచ్చు. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎంత వివాదం సృష్టించబోతున్నాడో తెలియదు కానీ తాను సింహం జూలు పట్టుకొని ఊగుతూ మురిసిపోతున్నానని గ్రహించినట్లు లేదు. చివరికి ఈ సినిమా ఏవిధంగా తీస్తాడో..దాని పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూడాలి.  


Related Post